
•అధిక దిగుబడికి నాణ్యమైన విత్తనాలే పునాది – తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి
•వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ సమన్వయంతో పని చేయాలి…
•ముందస్తుగానే నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
JAYNEWSTV: పెద్దపల్లి, మే 23 ( జయ్ న్యూస్ ):
పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్, డీసీపీ మరియు జిల్లా వ్యవసాయ అధికారుల సమీక్ష సమావేశంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు అందుబాటులో ఉండేట్లు చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులు అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని చెబుతూ, విత్తనాలలో ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు పాటించని నాసిరకం విత్తనాలను గుర్తించాలని వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖలను ఆదేశించారు. ఈ వానకాలం వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని, టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ని ఆయన కోరారు. నకిలీ విత్తనాల పట్ల రైతులకు అవగాహన కల్పించాలని, అలాగే డీలర్ల దగ్గర విత్తనాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా విత్తనాలకు సంబంధించిన రసీదు టాగు మరియు లేబుల్ జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని రైతులకు తెలియచేయాలని మండల వ్యవసాయ అధికారులను అన్వేష్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నాణ్యమైన విత్తనాలు రైతుల ద్వారా ఉత్పత్తి చేస్తుందని, ఆ విత్తనాలు రైతులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, రైతుల అవసరార్థం వాన కాలంలో ముందస్తుగానే నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సహకార సంఘాల సెక్రెటరీలు, ఆగ్రోస్ డీలర్లు మరియు ప్రయివేట్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.