
జయ్ న్యూస్: RC REDDY, సిరికొండ ప్రతినిధి (మే 25): ఆరుంగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక పోవడం వల్ల అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దయిందని, ఇప్పటికైనా వెంటనే వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతాంగానికి అండగా నిలవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరారు. ధర్పల్లి మండల కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. దాసు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతుల రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలని, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ప్రజా ఉద్యమకారులను బూటకపు ఎన్కౌంటర్లతో హత్యలు చేయడం దుర్మార్గమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు. నరేంద్ర మోడీ సర్కార్ అటవీ ప్రాంతంలో ఉన్న ప్రకృతి ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే రహస్య ఒప్పందం చేసుకొని, కగార్ ఆపరేషన్ పేరుతో ఆదివాసులను మావోయిస్టులను అతి కిరాతకంగా చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసి, అధికారాన్ని అధిష్టించిన నరేంద్ర మోడీ అమిత్షాలు చట్టాన్ని తుంగలో తొక్కి కక్ష సాధింపు లతో వెంటాడి, వేటాడి చంపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు కేశవరావుని హత్య చేసినంత మాత్రాన ప్రతిఘటన ఉద్యమాలు ఆగిపోవు అని ఆయన అన్నారు. దేశంలో వర్గ సమస్య పరిష్కరించకుండా, భూమి, నిరుద్యోగం, ఆకలి, అసమానతలు నిర్మూలించకుండా మార్క్సిజం- లెనినిజం ఆలోచనతో పని చేస్తున్న వారిని నిర్మూలించడం సాధ్యం కాదని చరిత్ర నిరూపించిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలను జరపాలని, అడవి సంపదను ప్రజలకు చెందినట్లు విధానాలను రూపొందించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మోడీ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని, రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య, ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శికార్ల్ మార్క్స్, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి పోశెట్టి, ఏఐకెఎంఎస్ నాయకులు నిమ్మల భూమేష్, గులాబ్ హుస్సేన్, పిట్లా ఎల్లన్న, నర్సాగౌడ్, పి వై ఎల్ నాయకులు మల్కి సంజీవ్, మహమ్మద్, ఐఎఫ్టియు నాయకులు సొప్పరి గంగాధర్, మణెమ్మ, సాయన్న తదితరులు పాల్గొన్నారు.