
జయ్ న్యూస్, నిజామాబాద్: బుధవారం నిజామాబాద్ నగరంలో గల శ్రీ రామ గార్డెన్స్ లో ” నూతన నేర న్యాయ చట్టాల మీద మీడియా ప్రతినిధులకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జులై 1, 2024 నుండి కొత్తగా ప్రవేశపెట్టిన చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, పాత చట్టాలాను సవరించి మూడు కొత్త చట్టాలను రూపొందిచారని, కొత్త చట్టాల ద్వారా వెంటనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు అమలులో ఉన్న పాత చట్టాలు ఐ.పి.సి మరియు సి.ఆర్.పి.సి చట్టాలు రద్దయ్యాయని వీటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం చట్టాలు అమలులోకి వచ్చాయని ఈ కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జర్నలిస్టులతో అవగాహన కల్పించి చట్టాల గురించి ప్రజలకు తెలియ జేయాలని వివరించారు. ప్రస్తుతం ఉన్న యుగంలో నూతన చట్టాలపై జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని, జనరల్ గా వ్రాసే వార్తలకు, క్రైమ్ వార్తలకు చాలా తేడా ఉంటుందని అయితే క్రైమ్ వార్తల విషయంలో తప్పనిసరిగా పలు సూచనలు జాగ్రత్తలు పాటించాలని, మైనర్లకు సంబంధించిన కేసులలో వారి పేర్లు కుటుంబ సభ్యుల వివరాలు ఎలాంటివైనా రాయకూడదని సూచించారు. తప్పనిసరిగా సంబంధిత అధికారి వివరణ తీసుకొని వార్తను ప్రచూరించాలన్నారు. తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పుకు శిక్ష తప్పనిసరిగా అమలవుతుందన్నారు. సోషల్ మీడియాలో ఏవైనా ఫోటోలు గాని వీడియోలు గాని పోస్టుచేసే ముందు ఎవరిదైతే వీడియో, ఫోటోలు తీసుకుంటున్నాము వారి అనుమతి తప్పని సరిగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఎ.ఐ యుగంలో ఉన్నందున ఉన్నది లేనట్టుగా మన ముందు చూపించవచ్చు, కానీ అది కరెక్టా కాదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తరువాతే ప్రచూరిస్తే బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో టెక్నాలజీని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి.. కానీ దానిని దుర్వినియోగం చేయకూడదన్నారు. ఎవ్వరయిన దుర్వినియోగం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా జైలులో జీవితం గడపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవగాహణ కార్యక్రమం పూర్తిగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు గల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఎ.సి.పిలు ఎల్.రాజా వెంకట్ రెడ్డి, జె. వెంకటేశ్వర్ రెడ్డి. పి. శ్రీనివాస్, మస్తాన్ అలీ, రూరల్ ఎస్.ఐ ఎమ్.డి ఆరీఫ్ఉద్దీన్ మరియు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.