
జయ్ న్యూస్, సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిన్న వాల్గోట్ గ్రామం నుండి నవనంది చౌరస్తా వరకు వెళ్ళే ముఖ్య రహదారిలో బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ ఆరంభం కాకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ప్రతి వర్షాకాలం వస్తుందంటే… చాలు ఈ రోడ్డు మార్గం అంతరాయాల మయంగా మారుతోంది. వరదలతో రహదారి పూర్తిగా మూసుకుపోతుండగా, ప్రజలు తమ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు – ప్రతి ఒక్కరూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ బ్రిడ్జిని మంజూరు చేయలేదు… అయినా ప్రజలు తమ ఆశను వదలలేదు… ఇప్పుడు నూతన ప్రభుత్వం ఉన్న ఈ పరిస్థితుల్లో… ప్రజల వినతి ఒక్కటే – “మా బ్రిడ్జికి న్యాయం చేయండి… మా ప్రయాణానికి మార్గం కట్టండి…” అని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు – “ఇది కేవలం ఓ బ్రిడ్జి కాదు… మా బతుకుదారి… మా జీవిత రేఖ!” అని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేస్తే, ఈ ప్రాంత అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రజలు భావిస్తున్నారు.