
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ సొంత వార్డు 23వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం మరియు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పట్టణ ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ప్రజలు తమ చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని అయ్యప్ప శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఈనెల రెండవ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.