
జయ్ న్యూస్, ఆర్మూర్: చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ యోధుడు కేసీఆర్ కు ఇన్ని వేధింపులా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము లేకనే ఎలాంటి లోపాలు లేని కాళేశ్వరం ప్రాజెక్టు పై విషం కక్కుతూ ఆయనకు నోటీసులు జారీ చేయడం కుట్రలో భాగమేనని ఆయన మంగళ వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ను విచారణకు పిలవడాన్ని తెలంగాణ ప్రజలు బ్లాక్ డేగా పరిగణిస్తున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. ఉద్యమ నేత, అభివృద్ధి, సంక్షేమ ప్రధాత కేసీఆర్ తో పెట్టుకున్నోళ్ళు ఎవరైనా మట్టి కొట్టుకుపోతరని ఆయన హెచ్చరించారు. కేసులకు, విచారణలకు భయపడమని, హామీల అమలుకు చివరి వరకు ప్రజల పక్షాన పోరాడుతామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.