
జయ్ న్యూస్, నిజామాబాద్, ఆగస్టు 11 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపించవద్దని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో జిల్లా అధికారుల హాజరును పరిశీలించేందుకు అటెండెన్స్ తీసుకోవాలని సూచించారు.
సోమవారం ఐ.డీ.ఓ.సీలో అదనపు కలెక్టర్ లు అంకిత్, కిరణ్ కుమార్ లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 83 వినతులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. అయితే ప్రజావాణికి పలు శాఖల జిల్లా అధికారులు గైర్హాజర్ అయ్యారు. మరికొంత మంది తమ కింది స్థాయి అధికారులను పంపించారు. దీనిని గమనించిన కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావాణికి జిల్లా అధికారులు గైర్హాజరు కావడం సమంజసం కాదన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ప్రజావాణిలో తప్పక ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎవరికైనా అత్యవసరమైన పని ఉంటే, ముందుగానే తమ దృష్టికి తేవాలని సూచించారు. తమ అనుమతి లేకుండా ప్రజావాణికి గైర్హాజర్ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్ రావు, మెప్మా పీ.డీ రాజేందర్, బోధన్ ఏ.సీ.పీ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.