
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సంబంధించి పోలీసు శాఖ సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది. ఈ క్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఐపీఎస్., శోభాయాత్ర సాగబోయే ప్రధాన రూట్ను, రహదారి మరమ్మతు పనులు, అలాగే గుండ్ల చెరువు వద్ద ఉన్న నిమజ్జన ఘాట్లను స్వయంగా పరిశీలించారు. శోభాయాత్ర దారిలో కాంట్రాక్టర్లు చేపడుతున్న బారికేడింగ్ పనులు, రహదారి మరమ్మతు పనులు, పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు బారికేడ్లు సరిగా ఏర్పాటు కావాలని, వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు వెంటనే మరమ్మతు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా శోభాయాత్రలో భారీగా జనసమ్మర్థం ఏర్పడే ప్రాంతాల్లో ట్రాఫిక్ను సమర్ధవంతంగా నియంత్రించేలా ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ను కఠినంగా అమలు చేయాలన్నారు. పలు కీలక జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలను మోహరించాలని సూచించారు.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ నిమజ్జన ఘాట్ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ పటిష్టమైన బారికేడ్లు, లైటింగ్, డ్రౌన్ ప్రూఫ్ జాకెట్లు, రక్షణ బృందాలు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆర్మూర్ ACP జె. వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ SHO సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ సిబ్బంది చందు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.