జయ్ న్యూస్, నిజామాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్. అధికారులను ఆదేశించారు.
ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలని సూచించారు. బుధవారం నాడు పోలీస్ కార్యాలయంలోని కమండ్ కంట్రోల్ హల్ లో పోలీస్ కమీషనర్ అధ్యక్షతన పోలీసు అధికారులతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (Model Code of Conduct) అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
*ఎన్నికల కోడ్ అమలు , ఏర్పాట్లు* : ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని తెలిపారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని , నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుందని వివరించారు.
*ఎలక్షన్ సెల్ ఏర్పాటు* : వెంటనే కమీషనరేట్ కేంద్రంలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని , దీనికి అనుభవజ్ఞులైన అధికారులను , సిబ్బందిని కేటాయించామని తెలిపారు. ఈ సెల్ కమీషనరేట్ వ్యాప్తంగా అధికారులకు సమన్వయకర్తగా వ్యవహరిస్తుందన్నారు.
*అంతర్ జిల్లా మరియు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు* : అతి త్వరలో అంతర్ జిల్లా మరియు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని , ఈ చెక్ పోస్టుల వద్ద ముమ్మర వాహన తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
*బైండ్ ఓవర్* : గత ఎన్నికల సంఘటనలను దృష్టిలో ఉంచుకుని , ఎన్నికల నేరస్థులను , రౌడీ షీటర్లను ఆయా రెవెన్యూ అధికారుల ముందు బైండ్ ఓవర్ చేయాలని సూచించారు.
*నగదు పరిమితి* : సరైన ఆధారాలు లేకుండా ₹50,000 కంటే ఎక్కువ నగదును వెంట తీసుకువెళ్లరాదని, ఈ నిబంధన ఉల్లంఘిస్తే అట్టి మొత్తాన్ని సీజ్ చేయాలని సీపీ ఆదేశించారు.
నామినేషన్ల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని పోలీస్ కమీషనర్ సూచించారు. ఎన్నికల హ్యాండ్బుక్లోని ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలని , అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్కు కేటాయించే పోలీసు అధికారులకు అవసరమైతే శిక్షణ కూడా అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వా రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సిసిఆర్బి సిఐ సతీష్, ఎలక్షన్ సెల్ సీఐ వీరయ్య మరియు జిల్లాలోని సి.ఐలు ఎస్.ఐ లు , ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.
