
జయ్ న్యూస్, హన్మకొండ: హన్మకొండలోని జెడ్పీ హాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ARSK, సీడ్ డీలర్స్, విత్తనాభివృద్ధి సంస్థ మరియు జిల్లా వ్యవసాయ అధికారులతో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాకాలం మొదలైనందున డీలర్లందరూ రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రాయించాలని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని అందులో భాగంగానే విత్తనాలు సరైన సమయంలో నాణ్యమైనవి రైతులకు అందెలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతులకు విత్తనాలు అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ విత్తనాల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రాంతాలకు అనుగుణంగా రైతుల డిమాండ్ మేరకు విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్నారు. డీలర్లు తమకు నమ్మకమైన, ప్రభుత్వ ప్రమాణలకు అనుగుణంగా ఉత్పత్తి చేసిన విత్తనాలను రైతులకు అందించి రైతు సంక్షేమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరారు. “తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ” ఆధ్వర్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రిలీజ్ అయిన విత్తనాలను విత్తనోత్పత్తి చేసి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. వరంగల్ TG సీడ్స్ నందు వారి పంటకు సంబందించి వివిధ రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను రైతులకు అందించాలని చెప్పారు. కావున డీలర్లు ఈ విత్తనాలను రైతులకు అందించి నకిలీ/ నాణ్యతలేని విత్తనాల బారి నుండి రైతులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు, వ్యవసాయ మరియు విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.