
జయ్ న్యూస్, డిచ్ పల్లి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి తో కలిసి విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించినారు. అనంతరం వైస్ ఛాన్స్లర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విశ్వవిద్యాలయాలు గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తూ సంపద సృష్టి కేంద్రాలుగా విలసిల్లాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అనేక ప్రణాళికలురూపొందిస్తున్నారన్నారు. నీళ్లు,నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా 2014 జూన్ 2న ఏర్పడ్డ తెలంగాణ నేడు అభివృద్ధి చెందుతూ భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తలసరి ఆదాయం లో ముందు ఉండడం గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను దురాలవాట్లకు దూరంగా ఉంచి నైపుణ్యమైన మానవ వనరులను అభివృద్ధిపరిచి ఉద్యోగితను పెంచడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడాన్ని స్వాగతించాల్సిందన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ కమిషన్ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ భర్తీకి పూనుకోవడంతో పాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తుందని చెప్పారు. హైదరాబాదును విశ్వ నగరంగా అభివృద్ధి చేస్తూ అనేక దేశాల నుండి పెట్టుబడులను ఆహ్వానించి అంతర్జాతీయ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ఆడిట్ సెల్ డైరెక్టర్, ఆచార్య ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ ఆచార్య కే సంపత్ కుమార్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్, ఆచార్య సిహెచ్ ఆంజనేయులు, ఆచార్య కే రవీందర్ రెడ్డి, డాక్టర్ లక్షణ చక్రవర్తి, డాక్టర్ టి సంపత్,అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయి గౌడ్, ఇంజనీర్ వినోద్,జ్యోతి, ఔట్సోర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.