
జయ్ న్యూస్, ఆర్మూర్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “ప్రొఫెసర్ జయశంకర్” బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులలో ప్రభుత్వ పాఠశాలలో బోధించే విద్య పట్ల నమ్మకం పెంచి విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, అలాగే విలువలతో కూడిన విద్య అందించి విద్యార్థుల ఉత్తీర్ణశాతం పెంచి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని సూచించారు. విద్యార్థులు కూడా కష్టపడి చదివి జీవితంలో ఉన్నతగా ఎదగాలని ఆకాంక్షించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మాత్రమే ప్రభుత్వ బడుల్లో చెప్తారని, ప్రభుత్వ బడులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బోధన విషయంలో ఉన్నాయని విద్యతో పాటు క్రీడా మానసిక ఉల్లాసం కేవలం ప్రభుత్వ పాఠశాలలో మాత్రం లభిస్తుందని, చదువుతోపాటు మధ్యాహ్నం సన్నబియ్యంతో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తుందని అన్నారు. అంకాపూర్ గ్రామంలో విద్యార్థుల చదువుకోసం గ్రామ అభివృద్ధి కమిటి మౌలిక వసతులలో పూర్తి సహకారం అందిస్తూ విద్యార్థులు ఎదుగుదలలో ఉపాధ్యాయులతో పాటు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MEO రాజ గంగారం, MPDO బ్రహ్మానందం, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.