జయ్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్, అక్టోబర్ 21 : ప్రభుత్వం, పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని, ధైర్యంగా ఉండాలని రాష్ట్ర డీ.జీ.పీ బి.శివధర్ రెడ్డి బాధిత కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకులకు భరోసా కల్పించారు. నిజామాబాద్ నగరంలో ఇటీవల రియాజ్ అనే నేరస్థుడిని అరెస్టు చేసి తీసుకువస్తున్న క్రమంలో హత్యకు గురైన సీ.సీ.ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబీకులను డీ.జీ.పీ శివధర్ రెడ్డి మంగళవారం మల్టీ జోన్ ఐ.జీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆదేశాల మేరకు తాను వచ్చానని వారికి వెల్లడించారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్యకు గురైన సంఘటన దురదృష్టకరమని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తపర్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు 300 గజాల ఇంటి స్థలం, పెన్షన్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని డీ.జీ.పీ గుర్తు చేశారు. అందరితో కలిసిమెలిసి ఉండే సిన్సియర్ పోలీసు ప్రమోద్ కుమార్ ను కోల్పోవడం బాధ కలిగించిందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా, తమ శాఖ తరపున అవసరమైన అన్ని సదుపాయాలు, సహాయ సౌకర్యాలు అందేవిధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
