జయ్ న్యూస్, నిజామాబాద్: నవంబర్ 07 : జిల్లా కేంద్రానికి సమీపంలో ఖానాపూర్ శివారులో కొనసాగుతున్న ఆర్.కె రైస్ మిల్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీల లోడ్ల ధాన్యం పంపించారు, వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలన జరిపారు.
అంతకుముందు కలెక్టర్ డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటివరకు ఎంతమంది రైతుల నుండి ధాన్యం సేకరించారు, రైస్ మిల్లులకు ఎన్ని లారీల లోడ్ల ధాన్యం వెళ్ళింది అని కేంద్రం నిర్వాహకులను ప్రశ్నించారు. అయితే, దొడ్డు రకం ధాన్యాన్ని రైస్ మిల్లుల వద్ద రోజుల తరబడి దించుకోవడం లేదని, దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని కేంద్రం నిర్వాహకులతో పాటు స్థానిక రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి, కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపాలని, లేని పక్షంలో కాంట్రాక్ట్ రద్దు చేస్తామని అన్నారు. అక్కడి నుండి కలెక్టర్ నేరుగా ఖానాపూర్ లోని ఆర్.కె రైస్ మిల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రక్ షీట్లను తెప్పించుకుని ధాన్యం అన్ లోడింగ్ సకాలంలో చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పలు లారీలు రైస్ మిల్ ఆవరణలో ధాన్యం బస్తాల లోడ్లతో నిలిచి ఉండడాన్ని గమనించిన కలెక్టర్, ఎన్ని రోజుల నుండి ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని లారీ డ్రైవర్ లను ప్రశ్నించారు. ఐదారు రోజులుగా దించుకోవడం లేదని వారు తెలుపగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ధాన్యం దిగుమతి చేసుకుని, వెంటవెంటనే ట్రక్ షీట్ లు అందించాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైస్ మిల్ నిర్వాహకులను నిలదీశారు. రోజుల తరబడి ధాన్యం దిగుమతి చేసుకోకుండా మిల్లుల వద్దే వాహనాలను నిలిపి ఉంచితే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ధాన్యం నిల్వలను సకాలంలో దించుకోకపోతే అకాల వర్షాల వల్ల తడిసిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ లకు సంబంధించి సమగ్ర పరిశీలన చేసి, తనకు పూర్తి సమాచారం అందించాలని కలెక్టర్ తన వెంట ఉన్న డీ.ఎస్.ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డిలకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం నిల్వలను దిగుమతి చేసుకునే విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు.
